ప్రపంచ తెలుగు మహాసభల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలుగుపై ప్రశంసలు గుప్పించారు.
‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అంటూ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభలు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి కోవింద్.. ఈ సభలు నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్యంలో కేసీఆర్కు మంచి పట్టు ఉందన్నారు. దేశంలో ఇప్పటి వరకు రాష్ట్రపతిగా పనిచేసినవారిలో ముగ్గురు తెలుగువారే అని గుర్తుచేశారు. స్వాతంత్ర్యోద్యమంలో తెలుగువారి త్యాగాలు మరువలేనివని కొనియాడారు.
అంగ్లేయులకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాటం చేశారని, పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించారని కీర్తించారు. తెలుగు భాషాభివృద్ధికి గురజాడ విశేషకృషి చేశారన్నారు. తెలుగు భాషకు ఎంతో విశిష్టత ఉందని, దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు అని అన్నారు. ప్రపంచం నలుమూలలా తెలుగువారు ఖ్యాతి పొందారన్నారు. హైదరాబాద్ అంటే బిర్యానీ, బ్యాడ్మింటన్, బాహుబలి అని పేర్కొన్నారు.