స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి
కొత్త సంవత్సరంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి.
రాష్ట్రంలో అమలులో ఉన్న బీసీల క్రిమిలేయర్ విధానంను ఎత్తివేయాలి.
కొత్త పద్ధతులతో, వైవిధ్యంగా డిమాండ్ల సాధనకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమాల నిర్మాణం.
సామాజిక న్యాయవేదిక ప్రతినిధుల సమావేశంలో డా|| వకుళాభరణం కృష్ణమోహన్రావు డిమాండ్
బీసీలకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లను కల్పించాలని సామాజిక న్యాయవేదిక, జాతీయ సమన్వయకర్త (రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్) డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు డిమాండ్ చేశారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించిన హామీలను కనీసం కొత్త సంవత్సరంలో అయినా థలవారీగా నెరవేర్చుతూ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలని ఆయన కోరారు. గురువారం నాడు నగరంలోని కాచిగూడలో గల ఒక ప్రైవేట్ ఫంక్షన్హాల్ సమావేశ మందిరంలో సామాజిక న్యాయవేదిక ముఖ్య ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వేదిక జాతీయ సమన్వయ కర్త డా|| వకుళాభరణం కృష్ణమోహన్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం పాత్రికేయులకు సమావేశం వివరాలను ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ రంగాలలో అందివచ్చే అవకాశాలకు అడ్డంకిగా ఉన్న క్రిమిలేయర్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల సాధనకు రాష్ట్రప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి డిమండ్లను సాధించుకునే దిశగా థలవారీగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాలలో ఉద్యమాలను నిర్మించడానికి వీలుగా ప్రతినిధుల సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ప్రతినిధుల సమావేశంలో నిర్ణయాలు :
1. రాష్ట్రప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీల విషయంలో గ్రామం, మండలం, జిల్లా కేంద్రాలు యూనిట్లుగా ఎక్కడికక్కడ ప్రతినిధుల సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేయాలి. డిమాండ్ల సాధనకు ప్రజల భాగస్వామ్యంతో వివిధ పద్ధతులతో నిరంతరం ఉద్యమాలను నిర్మించాలి.
2. ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మున్నగు సామాజిక మాధ్యమాలను విరివిగా ఉపయోగించుకొని సమస్యలను నివేదించి ‘సోషల్ మీడియా’ ఉద్యమం నిర్మించాలి.
3. విషయ పరిజ్ఞానం కలిగిన వక్తలను ఎంపిక చేసి సమావేశాలు, ధర్నాలు, ప్రదర్శనలు, సభలు నిర్వహించినప్పుడు ఉపన్యాసాలు ఇప్పించాలి.
4. వివిధ బీసీల సమస్యలపై ఉత్తేజం కలిగించే రీతిలో కవులు, రచయితలు, సాహితీవేత్తలతో పాటలు, కవితలు, నాటికలు, నాటకాలు రాయించి, కళాకారులచే ప్రదర్శనలు ఇప్పించాలి.
5. గ్రామం నుండి రాష్ట్ర స్థాయి వరకు వివిధ కమిటీలుగా…. సాంస్కృతిక, విద్యార్థి, యువజన, ఉద్యోగ, శ్రామిక, రైతు, మహిళా విభాగాలను ఏర్పాటు చేయాలి.
6. ఇప్పటికే రూపొందించిన 33 జిల్లాల వాట్సప్ గ్రూపులలో విరివిగా సభ్యులను చేర్పించాలి. ఎప్పటికప్పుడు అడ్మిన్లు అన్ని అంశాలను గ్రూపులలో పోస్ట్ చేయాలి.
7. అన్ని దిన, వార, మాస పత్రికలకు సమస్యలను ఏకరువు పెడుతూ, లేఖల రూపాలలో ప్రచురణకు పంపాలి. ఇదొక బృహత్తర ఉద్యమంగా కొనసాగాలి.
నేటి సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా పాల్గొన్న ప్రతినిధులు….. చంద్రపాల్, డి.కుమారస్వామి, మోక్షజ్ఞ, రవి, ప్రేమ్లాల్, జి.సమ్మయ్య, నవీన్ కౌశల్, జితేందర్ నేత, శ్రీరాం చక్రధర్, రవికాంత్, కె.రఘురాంగౌడ్, ఎం. ప్రభు వినయ్, కుక్కల రఘుపతి, దేశిని సాంబయ్య, గుజ్జ రాం భగవాన్, వీరేందర్, వైద్య వెంకట్, నళిని మోహన్, పి. సునీత, మణిబాల, కళ్యాణి, సుధావాణి, నిర్మల, నర్మద, భాగ్యమ్మ, పుష్పలత, వాణిదేవి, మైథిలి, కరుణ, దుర్గా నవీన్, సుస్మిత, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.