ఘనంగా సావిత్రి బాయి పూలే జయంతి – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. జూబ్లీ హిల్స్ లోని జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో జయంతి వేడుకలను నిర్వహించారు. భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలేను జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి స్మరించుకున్నారు.
దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ.. ‘ఆడవాళ్లు వంటింటికే పరిమితం.. ఇల్లు దాటకూడదు అంటూ.. భారతదేశం అంధకారంలో మగ్గుతున్న సమయంలో ఒక వేగుచుక్క సావిత్రిభాయి. చిన్న తనం నుండే చురుకైన సావిత్రిబాయికి చదువంటే చెప్పలేని మక్కువ. అప్పట్లో బాలికలకు విద్య నిషేధం. తొమ్మిదేండ్ల ప్రాయంలోనే 12 ఏళ్ల జోతిబాఫూలే తో బాల్య వివాహం నిర్వహించాగారు. జోతిబా సావిత్రిబాయిని ప్రోత్సహించి చదివించారు. నాటి ఆధిపత్య, అనాగరిక సమాజం మహిళలకు విద్య నిషేధమని అంటున్నా సావిత్రీబాయి చదువులో ముందుకు వెళ్ళింది. స్త్రీలకు విద్యనేర్పేందుకు 1847-48 లో అహ్మదాబాద్ లో ఉపాధ్యాయ శిక్షణ పొందింది.’ అని తెలిపారు.
“ఇక 1848 జనవరి 1వ తేదిన అణచివేయబడిన నిమ్నవర్గాల బాలికల కోసం పూణేలో బడి తెరచిందంటే ఆమె ధైర్యానికి మన సలామ్. 18 సంవత్సరాలకు ఇప్పటి పిల్లలు మహా అయితే ఇంటర్ లో ఉంటారు.. కానీ 18 సంవత్సరాల వయసుకే ఆమె బహుజనుల కోసం బడి తెరచింది. ఫూలే దంపతులిద్దరూ కలసి మొత్తం 52 పాఠశాలలు నెలకొల్పారు. ఎన్నో దాడులు ఎదుర్కొన్నారు.. తొక్కేయాలని చూశారు.. గ్రామ బహిష్కరణ కూడా చేశారు. కానీ ఆమెను ఇవేవీ అడ్డుకోలేకపోయాయి. స్త్రీలను చైతన్య పరచటం కోసం 1852 లో ‘మహిళా మండల్’ పేరుతో సంఘాన్ని స్థాపించింది. 1873 లో జోతిబాతో కలిసి ‘సత్యశోధక సమాజాన్ని’ నెలకొల్పి మూఢనమ్మకాల పై రాజీలేని పోరాటం చేసింది. ఒక శతాబ్దం తర్వాత ఆడపిల్లలు విద్యలో రాణిస్తున్నారంటే ఆ తల్లి చేసిన పోరాటాలు, ఆమె చేసిన త్యాగలే కారణం. బాల వితంతువులకు విద్యను అందించడం.. విముక్తి చేయడం కోసం ఆమె చాలా కృషి చేసింది, బాల్య వివాహాలు, సతి ప్రాతానికి వ్యతిరేకంగా ప్రచారం చేసింది. అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రచారం చేసింది. కుల మరియు లింగ ఆధారిత వివక్షను నిర్మూలించడంలో చురుకుగా పనిచేసింది. సావిత్రి బాబు సమాజంలోని కులతత్వం, పురుషాధిక్యత ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ ఆమె కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ పీడిత ప్రజలు, స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. నాటి, నేటి సమాజంలో సావిత్రిబాయి ప్రాముఖ్యత చాలా గొప్పది.” అని అన్నారు దుండ్ర కుమారస్వామి. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత పవన్ మరియు డిజిటల్ మీడియా సుభాష్ మరియు బీసీ దల్ కార్యకర్తలు పాల్గొన్నారు.